
- మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమం
- హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణలపై అవగాహన
- చట్టాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచన
- విద్యార్థుల ప్రశ్నలకు న్యాయవాదుల సమాధానాలు
- గ్రామీణ స్థాయికి న్యాయ చైతన్యం తీసుకెళ్లడమే లక్ష్యం
మల్కాజ్గిరి, ఆగస్టు 12 (కొత్తస్వరం): విద్యార్థుల్లో న్యాయ చైతన్యాన్ని పెంపొందించేందుకు NALSA (JAGRITI) Scheme, 2025–Justice Awareness for Grassroots Information and Transparency Initiative కార్యక్రమంలో భాగంగా మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా యూనివర్సిటీ డీన్, సీనియర్ న్యాయవాది జయరాం రఘునాథ్, డి. సాయి ప్రసాద్, న్యాయవాది రవి రాజ్ రాథోడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణలపై ప్రాథమిక అవగాహన ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా యువత చట్టాలను తెలుసుకోవడంతో పాటు వాటిని సమాజంలో బాధ్యతాయుతంగా వినియోగించే విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సీనియర్ న్యాయవాది డి. సాయి ప్రసాద్, న్యాయవాది రవి రాజ్ రాథోడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చట్టంపై అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవచ్చని, న్యాయ అవగాహన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చట్టపరమైన అంశాలపై అడిగిన ప్రశ్నలకు న్యాయవాదులు సమాధానాలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో న్యాయ చైతన్యం పెంపొందించడంతో పాటు చట్టంపై అవగాహనను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లే లక్ష్యానికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
