- రోడ్డుపై బిడ్డ దొరికిందంటూ ఓ యువకుడు సంచిలో తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చిన వైనం
పోలీసుల విచారణలో ఆ బిడ్డ తనకు తన లవర్కు పుట్టాడని చెప్పిన యువకుడు
తమిళనాడు, ఆగస్టు 11 (కొత్తస్వరం) :
తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై బిడ్డ దొరికిందంటూ ఓ యువకుడు సంచిలో తీసుకొచ్చి ఆసుపత్రిలో అప్పగించాడు. వివరాల్లోకి వెళితే… చెన్నై పరిధిలోని ట్రిప్లికేన్లోని ఓమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు పుట్టి ఒక్కరోజే అయిన శిశువును సంచిలో తీసుకొచ్చాడు. తనకు ఆ శిశువు రోడ్డుపై దొరికిందని ఆసుపత్రి సిబ్బందితో చెప్పాడు. అయితే, అదే సమయంలో అక్కడున్న పోలీసులు అనుమానంతో యువకుడిని విచారించారు. ఆ సమయంలో అతడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పీఎస్లో విచారించగా… తాను ఊటీ నుంచి వచ్చానని, తన పేరు ప్రదీప్ అని చెప్పాడు. గ్రూప్-1 ఎగ్జామ్ కోసం చెన్నైలోని హాస్టల్లో ఉంటూ చదువుతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో గిండి వర్సిటీ హాస్టల్లో ఉంటూ ఎంఎస్సీ చదువుతున్న ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, తాము శారీరకంగా ఒక్కటైనట్లు తెలిపాడు. దాంతో ఆ యువతి గర్భం దాల్చిందని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం సదరు యువతి హాస్టల్లో బిడ్డను ప్రసవించిందని, ఏం చేయాలో తోచక తాను బిడ్డను ఆసుపత్రిలో ఇచ్చేందుకు వచ్చానని పోలీసులతో అసలు నిజం చెప్పాడు. ప్రదీప్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.