పాములపాడు, కొత్తస్వరం :
పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి జి. హరిప్రసాద్ యాదవ్, తహసీల్దార్ జి. సుభద్రమ్మ, డీటీ పఠాన్ బాబు, ఆర్ఐ డి. ఖాజాబీ, డీవీఎంసీ సభ్యుడు లింగాల నాగరాజు, టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, అడ్వకేట్ గద్దల బతుకులయ్య తదితరులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మిట్టకందాల గ్రామానికి సంబంధించి మొత్తం 1,366 పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే, ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న 157 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు, 70 ఎకరాల ఎండోమెంట్ భూములు, అలాగే ఫ్రీ హోల్డ్ 22ఏ–1 కాలమ్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మిట్టకందాల గ్రామంలో ‘మీ భూమి–మీ హక్కు’ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ


