- జపాన్లో మనుషుల కోసం ప్రత్యేక ‘రిఫ్రిజిరేటర్’
టోక్యో, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్లో రూపొందించిన ఓ వినూత్న పరికరం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్ను జపాన్కు చెందిన ట్రుస్కో నకయామా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తగ్గించే లక్ష్యంతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. బయట నుంచి చూస్తే ఇది పెద్ద స్టీల్ ఫ్రిజ్లా కనిపిస్తుంది. ఇందులో ఒక వ్యక్తి కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గాజు తలుపును మూసిన వెంటనే తల, మెడ, భుజాలపై చల్లటి గాలి వేగంగా ప్రసరిస్తుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే శరీర ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా ఈ పరికరంలోని ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచుతారు. అయితే, ఎవరైనా లోపల కూర్చున్న వెంటనే 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన చల్లటి గాలిని నేరుగా పంపేలా దీన్ని రూపొందించారు. ఇది విశ్రాంతి కోసం ఉద్దేశించిన పరికరం కాదని, అధిక వేడి ప్రభావం తీవ్రమయ్యే ముందు శరీరాన్ని చల్లబరచడమే ప్రధాన లక్ష్యమని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చిన ఈ పరికరానికి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు దాదాపు 200 యూనిట్లు విక్రయించినట్లు ట్రుస్కో నకయామా సంస్థ తెలిపింది. ఉక్కు కర్మాగారాలు, నిర్మాణ రంగ సంస్థలు, గోల్ఫ్ మైదానాలు, విశ్వవిద్యాలయాలు, వినోద కేంద్రాలు వీటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇటీవల కుమమోటోలో సంభవించిన భూకంపం అనంతరం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు కూడా ఈ పరికరాలను పంపినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్ సౌకర్యం ఉంటే ఎక్కడైనా వీటిని ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. జపాన్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తరచూ 35 డిగ్రీల సెల్సియస్ను దాటుతుండటంతో వడదెబ్బ ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరికరాల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. జర్మనీ, అమెరికా సహా పలు దేశాల నుంచి కూడా ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్పై వివరాలు కోరుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఎండల నుంచి ఉపశమనం..


