జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత
అమరావతి, కొత్తస్వరం : అమరావతి రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు, అమరావతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని హోంమంత్రి అనిత విమర్శించారు. ఈ కారణంగా రాష్ట్రం విలువైన సమయాన్ని కోల్పోయిందని ఆరోపించారు. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలు కూడా వచ్చి పరిశీలించాలని ఆమె పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి పురోగతికి కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సేవలను ఈ సందర్భంగా అనిత ప్రశంసించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం కోసం రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన ‘వాక్ టు వర్క్’ విధానానికి అనుగుణంగా సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నివాస ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగులు తమ విధులు నిర్వహించేలా అన్ని ఆధునిక సౌకర్యాలతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


