3-స్టార్ హోటల్ అద్దెను ప్రామాణికంగా తీసుకోవాలి
ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులపై నియంత్రణ
చికిత్స, పరీక్షల ధరలకూ కళ్లెం
ముందే అంచనా వ్యయం చెప్పాలని సూచన
కేంద్ర నిర్ణయంపైనే సిఫార్సుల అమలు
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (కొత్తస్వరం): మెట్రో నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల సగటు అద్దె కంటే రూమ్ చార్జీలు అధికంగా ఉండకూడదని సూచించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం 176వ నివేదికలో పెరుగుతున్న వైద్య ఖర్చులను నియంత్రించి రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ సూచనలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్స వ్యయంలో భారీ వ్యత్యాసం ఉందని పేర్కొన్న కమిటీ.. 2025 జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటు చికిత్స వ్యయం రూ.6,631 కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.50,508గా ఉందని తెలిపింది. గది అద్దెలను హేతుబద్ధీకరించడంతో పాటు కీలక చికిత్సలు, వైద్య పరీక్షల ధరలను నియంత్రించేందుకు చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. చికిత్స ప్రారంభానికి ముందే అంచనా వ్యయాన్ని రోగులకు తెలియజేయాలని సూచించింది. అయితే ఈ పరిమితి ప్రాథమిక గది అద్దెకే వర్తిస్తుందని, వైద్యులు, నర్సింగ్, భోజనం వంటి ఇతర సేవలకు అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చని పేర్కొంది. ఆసుపత్రులను హోటళ్లతో పోల్చడం సరికాదని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అభిప్రాయపడగా, ప్రస్తుతం ఇవి సిఫార్సులు మాత్రమేనని, అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది.
