- మిట్ట కందల, బుద్ధ నగర్ రైతుల్లో భయాందోళన
- ఏడాది కాలంగా కొనసాగుతున్న సమస్య
- నీటి ప్రవాహంతో మట్టి జారిపోతున్న పరిస్థితి
- అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు
- సిమెంట్ బెడ్లు, మట్టి కట్ట బలోపేతం చేయాలని డిమాండ్
పాములపాడు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
పాములపాడు మండల కేంద్రానికి సమీపంలోని మిట్ట కందల, బుద్ధ నగర్ గ్రామాల రైతులు కేసీ కెనాల్ ఆయకట్టు కింద తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సుంకేసుల డ్యామ్ నుంచి కర్నూలు మీదుగా కడప వరకు రైతులకు తాగునీరు, సాగునీరు అందించే జీవనాధారంగా ఉన్న కేసీ కెనాల్కు గత ఏడాది కాలంగా సిమెంట్ బెడ్డు పగుళ్లకు గురైంది. దీంతో కెనాల్లో ప్రవహిస్తున్న నీరు పైకి ఎక్కుతూ మట్టి జారిపోతున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు బోయ మద్దిలేటి మాట్లాడుతూ తాము ఎప్పటి నుంచో కేసీ కెనాల్ కింద పంటలు సాగు చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్నామని తెలిపారు. కెనాల్కు పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు కట్ట తెగిపోతుందోనని రైతులంతా భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. సమస్యను ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏడాది కాలంగా ఎలాంటి మార్పు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో సిమెంట్ బెడ్లు నిర్మించి, మట్టిని ఎత్తుగా పోసి నీరు పైకి రాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
