- ఏపీయూడబ్ల్యూజే పిలుపు
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి ఆందోళన
- వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
- జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి
- ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు
కర్నూలు, సెప్టెంబర్ 20 (కొత్త స్వరం) :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని పురస్కరించుకుని జాతీయ కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోరంట్ల కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు ఎన్. వెంకట సుబ్బయ్య, కే. నాగరాజు, రాష్ట్ర సమితి సభ్యులు వైవీ కృష్ణారెడ్డి, భాష్యం మధుసూదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి అంజి, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్, వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, నగర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. నాగేశ్వరరావు, బీ. మల్లికార్జున కోరారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మీడియా స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున జాతీయ స్థాయిలో కోర్కెల దినం పాటించాలని ఐజేయూ పిలుపునిచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో చేపట్టబోయే ఈ ఆందోళనలను జిల్లాలోని ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు తదితరులు పాల్గొన్నారు.
