ఖమ్మం, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో, రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు, వ్యూహాలు, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా హాజరై, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం


