- జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
- చేనేత వస్త్రాల వినియోగానికి పిలుపు
- నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు
- ‘నేతన్న సేవలో’ సహా సంక్షేమ పథకాల ప్రస్తావన
- చేనేత ప్రచారంలో యువత భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
అమరావతి, ఆగస్టు 7 (కొత్త స్వరం) :
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని నేత కార్మికులు, కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నేతన్నల సేవలను కొనియాడుతూ, ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతి, చేతిపనితనం, స్వావలంబనకు ప్రతీక అని పేర్కొన్నారు. చేనేతను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయవచ్చని చెప్పారు. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం గర్వకారణమని వెల్లడించిన ఆయన, జనసేనలో ‘నేత కార్మికుల అభివృద్ధి విభాగం’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత విద్యుత్, రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ‘నేతన్న సేవలో’ వంటి పథకాల ద్వారా నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యువత, కంటెంట్ క్రియేటర్లు చేనేత దుస్తులు ధరించి ప్రచారం చేయాలని, ప్రతి భారతీయుడు చేనేతను దైనందిన జీవితంలో భాగం చేసుకుని నేత కార్మికులకు అండగా నిలవాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
