- మీడియా ప్రతినిధులకు పారిశ్రామికవేత్త కే.రవీందర్ సన్మానం
- దాతల సహకారంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్
- ప్రజలు–ప్రభుత్వం మధ్య వారధిగా జర్నలిస్టులు
- జర్నలిస్టుల సేవలకు సమాజం అండగా నిలవాలి
- ప్రజా సమస్యలపై చర్చకు ప్రెస్ క్లబ్ వేదిక కావాలి
పాములపాడు, ఆగస్టు 12 (కొత్తస్వరం):
పాములపాడు మండల కేంద్రంలో త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయనున్న మీడియా ప్రతినిధులను ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకుడు కంకటి రవీందర్ ఘనంగా సన్మానించారు. దాతల సహకారంతో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎస్. షర్ఫరుద్దీన్ అలీ, భావన వినోద్ కుమార్, జి. గోవిందు, కలబండి మోసే, ఎం. వెంకట రమేష్ తదితర మీడియా ప్రతినిధులకు కంకటి రవీందర్, ఏపీ–తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, కొత్తస్వరం దినపత్రిక సీఈవో, ఎడిటర్ కేడం రవిరాజు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కే. రవీందర్, కే. రవిరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి నేటి వరకు పాత్రికేయులు మారుమూల ప్రాంతాల నుంచి దేశ, విదేశాల్లో జరిగే ప్రతి విషయాన్ని ఎంతో శ్రమించి సేకరించి ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల్లో పలువురు పత్రికా విలేకరులుగా పనిచేశారని, స్వాతంత్ర్య ఉద్యమంలో వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజాన్ని నిత్యం చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. నిత్యం కలం పట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ వార్తలు సేకరించి నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి జీతభత్యాలు లేకుండా స్వచ్ఛందంగా పనిచేసే విలేకరుల సేవలు గొప్ప సమాజసేవగా అభివర్ణించారు. జర్నలిస్టుల అభివృద్ధికి సహకరించడంతో పాటు పాములపాడులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నిర్భయంగా వెల్లడించడంతో పాటు వాటిపై చర్చించేందుకు ఒక వేదిక అవసరమని, అదే వేదిక ప్రెస్ క్లబ్గా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. త్వరలో పాములపాడులో ప్రెస్ క్లబ్ ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.
