- విద్య ఖరీదుపై ప్రశ్నిస్తే నక్సలిజమా?
- ఉద్యోగాలు, రైతుల సమస్యలపై మాట్లాడితే నక్సలిజమా?
- ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశద్రోహమా?
- ప్రశ్నించే యువతను శత్రువులుగా చూడొద్దని డిమాండ్
- విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని ఏఐఎఫ్డీఎస్ విజ్ఞప్తి
కర్నూలు (నందికొట్కూరు), ఆగస్టు 23 (కొత్తస్వరం):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాకీ నక్సల్స్’ పదప్రయోగంపై అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్డీఎస్) కార్యదర్శి డక్క కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే యువత, మేధావులు, శాంతియుత నిరసనకారులను ఇలాంటి పదాలతో ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి సమంజసం కాదన్నారు. యువత ఉద్యోగాలు, విద్య ఖరీదు, రైతుల సమస్యలు, సామాజిక న్యాయం కోసం ప్రశ్నిస్తే నక్సలిజమా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయడం వేరు, హింసాత్మక చర్యలకు పాల్పడటం వేరని, ఈ రెండింటినీ ఒకే కోణంలో చూడరాదన్నారు. నేటి యువత ప్రభుత్వం, ప్రతిపక్షం రెండింటినీ ప్రశ్నిస్తున్నారని, వారి అసంతృప్తికి కారణాలను అర్థం చేసుకుని సమస్యలకు పరిష్కారాలు చూపాలని కోరారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు సమాధానం వాదన, విధానాలు, పనితీరు ద్వారా ఇవ్వాలని, విమర్శించే ప్రతి వ్యక్తిని దేశద్రోహిగా చూడటం సరికాదన్నారు. ప్రశ్నించే హక్కుతో పాటు బాధ్యత కూడా ఉందని, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రచారం చేయకుండా శాంతియుత, చట్టబద్ధ మార్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సూచించారు. ‘మమ్మల్ని దిమాకీ నక్సల్స్, దేశద్రోహులు అనడం బదులు విద్య, ఉపాధిపై దృష్టి సారించండి’ అని డక్క కుమార్ డిమాండ్ చేశారు.
